Droupadi Murmu: నెలకు రూ.10లతో కాలేజీకి వెళ్లారు.. ద్రౌపదీ ముర్ము గురించి ఈ విషయాలు తెలుసా?

దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఇప్పటివరకు అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది.

Published : 22 Jul 2022 02:16 IST

ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము ఘన విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని  అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ ఆసీనులుకానున్నారు. సంతాల్‌ ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము తదుపరి రాష్ట్రపతిగా రైసినా హిల్‌ మెట్లెక్కబోతున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నిక ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించారు.

అంతేగాక, దేశంలో ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న రెండో మహిళ కూడా ఈమే. అంతకుముందు ప్రతిభా పాటిల్‌ తొలి మహిళా రాష్ట్రపతిగా ఘనత సాధించారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో జన్మించిన ముర్ము.. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఈమే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.

నెలకు రూ.10తో కాలేజీకి వెళ్లి..

ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ముర్ము ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఈ ప్రయాణం ఆమెకు నల్లేరు మీద నడకేం కాదు. ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఝార్ఖండ్‌ సరిహద్దులోని పహర్ద్‌పూర్‌ గ్రామంలో 80శాతం సంతాల్‌ తెగ వారే ఉండేవారు. ఆ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ముర్ముకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తమ ఊరి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లి కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి ఈమే అంటే అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన నెలకు రూ.10తోనే కాలేజీకి వెళ్లి చదువును పూర్తి చేసుకున్నారామే.

గవర్నర్‌ అయినా ఐదు గదుల ఇంటిలోనే..

ద్రౌపదీ ముర్ము ప్రభుత్వ క్లర్క్‌గా తన వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టీచర్‌గానూ పనిచేశారు. 1997లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె రాయ్‌రంగ్‌పూర్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికై.. మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. గతేడాది ఆమె పదవీకాలం పూర్తవడంతో తిరిగి తమ స్వస్థలమైన రాయ్‌రంగ్‌పూర్‌ తిరిగొచ్చారు. ఈ పట్టణంలో తన భర్త కట్టించిన ఐదు గదుల ఇంట్లోనే అప్పటి నుంచి ఉంటున్నారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆమె నిరాడంబరతే  ప్రజలకు చేరువచేసింది.

ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోయి..

ముర్ము వ్యక్తిగత జీవితంలో పూడ్చలేని విషాదాలు మూడుసార్లు ఎదురయ్యాయి. వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరవైల్లో ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త శ్యామ్‌ చరణ్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. భర్త శ్యామ్ చరణ్‌, కొడుకులు లక్మన్‌, షిపున్‌ పేరు మీద ముర్ము.. ఎస్‌ఎల్‌ఎస్‌ మెమోరియల్‌ స్కూల్‌ను నిర్మించారు.

ముర్ము రాజకీయ ప్రస్థానమిది..

* 1997: భాజపాలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నిక

* 2000: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

* 2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వం)

* 2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి

* 2004: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక

* 2002-2009: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు

* 2010: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2013-2015: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2015: ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని