
72గంటల పాటు ఆ జిల్లాకు నేతలు వెళ్లొద్దు: ఈసీ
దిల్లీ: పశ్చిమ బెంగాల్లోని కోచ్బిహార్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఈసీ పలు ఆంక్షలు విధించింది. మూడు రోజుల పాటు ఆ జిల్లా సరిహద్దుల్లో నేతల పర్యటనలు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కోచ్బిహార్ జిల్లాలో కేంద్ర భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ నెల 17న ఐదో దశ ఎన్నికలకు సైలెంట్ పీరియడ్ను 72గంటలకు పొడిగించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్కు 72గంటల ముందు నేతలెవరూ ప్రచారం నిర్వహించకుండా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాల్పులు చోటుచేసుకున్న ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ ఆదివారం రోజున కోచ్బిహార్లో పర్యటించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని కేంద్ర బలగాలు!
మరోవైపు, బెంగాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ అదనపు కేంద్ర బలగాలను పంపింది. 33 కంపెనీల బీఎస్ఎఫ్, 12 కంపెనీల సీఆర్పీఎఫ్, 12 కంపెనీల ఐటీబీపీ, తొమ్మిది కంపెనీల ఎస్ఎస్బీ, నాలుగు కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలను తదుపరి నాలుగు దశల ఎన్నికలకు మోహరించనున్నట్టు తెలిపింది.