ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారుల బదిలీలపై ఈసీ కీలక ఆదేశాలు

శాసనసభ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌ ఆయా రాష్ట్రాల చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 31లోగా దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Published : 02 Jun 2023 21:58 IST

దిల్లీ: దేశంలో శాసనసభ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి జాతీయ ఎన్నికల కమిషన్‌ (EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు (సీఈవో) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించకూడదని సూచించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోస్టులో మూడేళ్లకు మించి పనిచేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో తమ బంధువులు ఎవరు లేరని, తమపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించింది. ఈ నిబంధనలు డీఈవోలు, డిప్యూటీ డీవోలు, ఆర్‌వో, ఏఆర్‌వో, ఈఆర్‌వో, ఏఈఆర్‌వోతోపాటు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అన్ని స్థాయిల్లోని పోలీసులు అధికారులకు వర్తిస్తాయని తెలిపింది. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి జులై 31లోగా ఈసీకి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని