Punjab: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్‌.. సీఎం చన్నీ సమీప బంధువు అరెస్ట్‌..!

పంజాబ్‌ (Punjab) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్ చన్నీ

Published : 04 Feb 2022 10:16 IST

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు (Punjab Assembly elections 2022) దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) మేనల్లుడు భూపిందర్‌ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో గురువారం కొన్ని గంటల పాటు భూపిందర్‌ను విచారించిన అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.

చన్నీ మరదలి కుమారుడు అయిన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే రెండు వారాల క్రితం భూపిందర్‌ సింగ్‌ ఇల్లు, కార్యాలయాలలో ఈడీ సోదాలు చేపట్టింది. చండీగఢ్‌, మొహాలీ, లూథియానా, పఠాన్‌కోట్‌ సహా మొత్తం 12 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. సోదాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమ నగదు, ఇతర పత్రాలు, నగలు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.8 కోట్లు ఒక్క భూపిందర్‌ ఇల్లు, కార్యాలయాల్లోనే లభించినట్లు అధికారులు తెలిపారు. మిగతా సొమ్మును ఆయన సన్నిహితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో భాగంగానే గురువారం జలంధర్‌లోని భూపిందర్‌ నివాసానికి వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. అయితే, అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు భూపిందర్‌ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌ను తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

కక్షసాధింపు చర్యే..

ఈడీ సోదాలపై గతంలోనే స్పందించిన చన్నీ.. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. గతంలో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువుల ఇళ్లలో ఇలాగే తనిఖీలు జరిపారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని దుయ్యబట్టారు. అయితే ఆ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ ఇసుక తవ్వకాలు ప్రధానాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ మాజీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. ఇసుక మైనింగ్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం కెప్టెన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ భాగస్వాములే. నేను పేర్లు చెప్పడం మొదలుపెడితే.. టాప్‌ (సీఎంను ఉద్దేశిస్తూ) నుంచి చెప్పుకుంటూ రావాలి’’ అని ఆరోపించారు. 

అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో చన్నీపై పలు మార్లు విమర్శలు గుప్పించింది. సీఎం చన్నీ సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని గతేడాది డిసెంబరులో ‘ఆప్‌’ ఆరోపించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని