ED raids: అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడులు

మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాస ప్రాంగణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని నిర్వహించింది. ఆదివారం

Published : 18 Jul 2021 13:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా దీనిని నిర్వహించింది. ఆదివారం ఉదయం 7.30 సమయంలో నాగ్‌పూర్‌లోని కటోల్‌ ప్రాంతంలో దాడులను మొదలుపెట్టింది. ఈడీ, సీఆర్‌పీఎఫ్‌ బృందం ఆయన ఇంటిని ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. ఆ సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌, కుటుంబ సభ్యులు అక్కడలేరు.

అనిల్‌ దేశ్‌ముఖ్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేస్తోంది. ‘‘ప్రజాప్రయోజనాల కోసం చేపట్టిన పదవిని దుర్వినియోగం చేసి బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్ల వసూళ్లకు ప్రయత్నించారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. 

ఈ నెల 16వ తేదీన దేశ్‌ముఖ్‌కు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఆయనపై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌  కింద ఆయన ఆస్తులను జప్తు చేసింది.  వీటిల్లో రూ.1.5 కోట్ల విలువైన వర్లీలోని ఓ ఫ్లాట్‌, రూ. 2.67 కోట్లు విలువైన మరికొన్ని స్థలాలు ఉన్నాయి. 

మరోవైపు ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని