Rahul Gandhi: సోనియా, రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు..!

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది

Updated : 01 Jun 2022 15:21 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జూన్‌ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌ స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకు వారికి సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.

సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ తదితరులు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సాల్‌లను ప్రశ్నించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని