Sanjay Raut: సంజయ్‌ రౌత్‌ ఇంటిపై ఈడీ ఆకస్మిక దాడి

Sanjay Raut: శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు....

Published : 31 Jul 2022 10:46 IST

ముంబయి: శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ (ED) కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుండడం గమనార్హం. 

ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకుంది. పత్రాచాల్‌ భూకుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’’ అని ట్వీట్‌ చేశారు.

రౌత్‌ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్‌ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్‌ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు.

సంజయ్ రౌత్‌ను జులై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు. పత్రాచాల్‌ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్‌ సహా, మరికొంతమంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని