Video: గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..!

ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలోని గురుద్వారాను ఆయన సందర్శించారు. అక్కడ భక్తుల బూట్లు తుడవడంతో పాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రంచేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఆ దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు....

Updated : 04 Sep 2021 13:30 IST

దేహ్రాదూన్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ తన మాట నిలబెట్టుకున్నారు. ఓ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచి.. ఆ ప్రార్థనా మందిరాన్ని చీపురుతో శుభ్రపరిచారు. సిక్కుల పవిత్రమైన ఓ పదాన్ని ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తాను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ ప్రకటించిన రావత్‌.. ఇందులో భాగంగా శుక్రవారం తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలోని గురుద్వారాను ఆయన సందర్శించారు. అక్కడ భక్తుల బూట్లు తుడవడంతో పాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రంచేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఆ దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే?

గతవారం పంజాబ్‌లో పర్యటించిన హరీశ్‌ రావత్‌ అక్కడ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ నేతృత్వంలోని పార్టీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చండీగఢ్‌ పర్యటనకు వెళ్లిన హరీశ్‌ రావత్‌.. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సిద్ధూ, మరో నలుగురు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులనుద్దేశిస్తూ వారిని సిక్కుల పవిత్ర పదంతో పోల్చడం వివాదాస్పదమైంది. అవి సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు చెప్పిన రావత్‌.. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ‘‘కొన్నిసార్లు.. మర్యాద, గౌరవాన్ని వ్యక్తపరిచే క్రమంలో కొన్ని పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. నేను అలాగే ఆ పవిత్ర పదాన్ని వాడి తప్పుచేశాను. వారి మనోభావాలను బాధపెట్టినందుకు వారికి క్షమాపణలు చెబుతున్నా. సిక్కుల సంప్రదాయం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా తప్పునకు ప్రాయశ్చిత్తంగా  గురుద్వారాలో కరసేవ చేస్తాను’’ అని రావత్‌ ప్రకటించారు. తాను చెప్పినట్టుగానే శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని ఓ గురుద్వారాను సందర్శించి కరసేవ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు