
ZyCoV-D: జైడస్ క్యాడిలా టీకాకు నిపుణుల కమిటీ ఓకే..!
అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ డీసీజీఐకి సిఫార్సులు!
దిల్లీ: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి సిఫార్సులు చేసినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థల కథనాలు పేర్కొంటున్నాయి.
జైకోవ్-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్ క్యాడిలా జులై 1వ తేదీన దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డీసీజీఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. డీఎన్ఏ సాంకేతికతతో జైడస్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్ల పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జైకోవ్-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది.
ఈ టీకాకు డీసీజీఏ అనుమతులు మంజూరు చేస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా ఇదే కానుంది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.