Kiren Rijiju: కిరణ్‌ రిజిజుపై.. అందుకే వేటుపడిందా..?

కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజును (Kiren Rijiju) తప్పించి.. ఆయనకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

Updated : 18 May 2023 15:17 IST

దిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి (Law Minister)గా పనిచేసిన కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతలనుంచి తప్పించి.. భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, కిరణ్‌ను తప్పించడానికి కారణాలు ఏమైనా.. ఆయన న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో నియామకాల కోసం అనుసరించే కొలీజియం వ్యవస్థతో(Collegium System)పాటు కోర్టు వ్యవహారాల్లో పారదర్శకతపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతకాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. న్యాయవ్యవస్థపై బహిరంగంగా విమర్శలు కొనసాగిస్తున్న  నేపథ్యంలోనే ఆయనపై వేటుపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరణ్‌ రిజిజు రాజకీయ ప్రస్థానం.. ఆయనపై నెలకొన్న కొన్ని వివాదాలను పరిశీలిస్తే..

అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కిరణ్‌ రిజిజు (51), మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హన్స్‌రాజ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. దిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన వ్యవహారాలు, క్రీడలు, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జులై 2021లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కొలీజియంపై విమర్శలు..

న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టే కొలీజియం వ్యవస్థపై మాట్లాడిన ఆయన.. ఆ వ్యవస్థలో పారదర్శకత లేదని సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థకు లేదా న్యాయమూర్తులకు తాను వ్యతిరేకం కాదన్న ఆయన.. ఇలాంటి భావన ప్రజల్లో ఉందని చెప్పారు.

ప్రభుత్వ పాత్ర ఉండాల్సిందే..!

 ఈ ప్రక్రియలో ప్రభుత్వ పాత్ర తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు కిరణ్‌ రిజిజు లేఖ కూడా రాయడం గమనార్హం.

మండిపడ్డ లాయర్లు..

కొలీజియంతోపాటు న్యాయవ్యవస్థపై కొంతకాలంగా కిరణ్‌ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలపై దేశంలో పలు న్యాయవాద సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏకంగా బాంబే లాయర్స్‌ అసోసియేషన్‌ (BLA) సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. రాజ్యాంగ ఔన్నత్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన బీఎల్‌ఏ.. కిరణ్‌ రిజిజును రాజ్యాంగబద్ధ పదవి నుంచి తప్పించాలని కోరింది. అయితే, అటువంటి వ్యాఖ్యల విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరిస్తామని పేర్కొంటూ ఆ పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలా న్యాయశాఖమంత్రిగా పలు వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన కిరణ్‌ రిజిజును ఆశాఖ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించింది.

‘ఫెయిల్డ్‌ లా మినిస్టర్‌..’

కిరణ్‌ రిజిజును న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. కిరణ్‌ రిజిజు ఒక ‘విఫల న్యాయశాఖ మంత్రి’ అని.. భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రిగా ఏం చేయగలరని కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ విమర్శించారు. సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ కూడా కిరణ్‌ రిజిజుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని