‘అప్పటివరకు ఉద్యమిస్తాం’

మోదీ ప్రభుత్వం పదవీ కాలం ముగిసే వరకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకుడు నరేంద్ర తికాయిత్‌ తెలిపారు.

Published : 11 Mar 2021 01:27 IST

ముజఫర్‌నగర్‌: ఎన్డీయే ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకుడు నరేంద్ర తికాయిత్‌ తెలిపారు. ప్రస్తుతం బీకేయూకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ తికాయిత్‌ సోదరుడే నరేంద్ర తికాయిత్. రైతుల ఆందోళనల గురించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇతర ఆందోళనలను అణచివేసిన తరహాలో రైతుల ఉద్యమాన్ని అరికట్టాలనుకునే అపోహ నుంచి ప్రభుత్వం తేరుకోవాలని హితవు పలికారు. 

‘ప్రభుత్వం వివిధ వ్యూహాలను అనుసరించి గతంలో ఇతర ఆందోళనలను అణచివేసింది. ఇప్పడు రైతుల ఉద్యమాన్ని కూడా అలాగే చేయాలనే అపోహలో ఉంది. నేను ముజఫర్‌నగర్‌లో ఉన్నప్పటికీ.. నా కళ్లు దిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నాయి. తరచూ వెళ్లి బీకేయూ మద్దతుదారుల్ని కలిసి వస్తున్నాను. ఈ నిరసనల్ని ప్రభుత్వం అణచివేయలేదు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల గడువు ఉంది. ఆ గడువు ముగిసే వరకు మేం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం పంటలకు మద్దతు ధర ఉంటుందని చెబుతోంది. కానీ మరి ఆ విషయంలో రాత పూర్వక హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని