Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై తప్పుడు కేసు నమోదు చేశారు: మైనర్‌ బాలిక తండ్రి

జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhusha Sharan Singh)పై లైంగిక ఆరోపణలతో నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌పై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని మైనర్‌ బాలిక తండ్రి అన్నారు.

Published : 08 Jun 2023 22:54 IST

దిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhusha Sharan Singh)పై తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారని మైనర్‌ బాలిక తండ్రి చెప్పారు. ఆయన తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా రెజ్లర్లు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫిర్యాదును దిల్లీ పోలీసులు పట్టించుకోవడంలేదని, బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో మహిళా రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేశారు. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన వారిలో మైనర్‌ బాలిక ఉండటంతో బ్రిజ్‌ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. 

నిజం బయటికి రావాలని..

తాజాగా మైనర్‌ బాలిక తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మీ వాదనను మార్చుకుంటున్నారని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. నిజం ఇప్పటికైనా బయటికి రావాలని కోరుకుంటున్నానన్నారు. ‘‘ నిజం కోర్టులో కంటే ముందే బయటికి రావడం మంచిదని భావిస్తున్నా. ప్రభుత్వం రెజ్లర్లతో చర్చలు ప్రారంభించింది. గతేడాది ఆసియా అండర్‌-17 ఛాంపియన్‌షిప్‌ ఎంపికల్లో నా కూతురు ఓటమిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. అందువల్ల, ఇప్పుడు తప్పును సరిదిద్దుకోవడం నా బాధ్యత’’ అని మైనర్‌ బాలిక తండ్రి వ్యాఖ్యానించారు. 

అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా

బ్రిజ్‌భూషణ్‌పై తనకు, తన కుమార్తెకు ఉన్న కోపానికి గల కారణాన్ని కూడా ఆ తండ్రి బయటపెట్టాడు. ‘‘2022 అండర్‌-17 ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు భారత రెజ్లర్ల ఎంపికలు లఖ్‌నవూలో జరిగాయి. ఆ సమయంలో ఫైనల్స్‌లో నా కుమార్తె ఓడిపోయింది. దీంతో అండర్‌-17 పోటీలకు భారత్‌ తరపున పాల్గొనలేకపోయింది. ఆ పోటీల్లో రిఫరీ నిర్ణయానికి బ్రిజ్‌ భూషణ్ కారణమని అప్పట్లో కొందరు ఆరోపించారు. దీంతో నా కుమార్తె ఒక ఏడాదిపాటు పడిన కష్టమంతా వృథా అయిపోయింది. అందుకే బ్రిజ్‌ భూషణ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నా’’ అని మైనర్ బాలిక తండ్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు