
Omicron: ‘అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సమర్థనీయమే’
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్కు పాకిన విషయం తెలిసిందే. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు దక్షిణాఫ్రికన్ దేశాల నుంచి రాకపోకలను కట్టడి చేస్తున్నాయి. అమెరికా సైతం దక్షిణాఫ్రికాతోపాటు ఇతర ఏడు దేశాల నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయితే, కొత్త వేరియంట్ నుంచి ముప్పు ఏస్థాయిలో ఉందన్న విషయమై ఇంతవరకు తగినంత సమాచారమేదీ లేకుండానే ఈ విధంగా నిషేధం విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ (సామా) తప్పుపట్టిన విషయం తెలిసిందే.
‘వేరే మార్గమేది లేదు..’
కానీ.. అమెరికా విషయంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ.. ఈ ప్రయాణ ఆంక్షలను సమర్థించారు. ప్రస్తుతం ఈ చర్యలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రయాణ ఆంక్షలతో వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుంది! దీంతో ఈ సమయంలో వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినంత సమయం దొరుకుతుంది’ అని వివరించారు. ప్రస్తుతానికి ప్రయాణాలపై నిషేధం విధించడం తప్ప కొత్త వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు వేరే మార్గం లేదని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.