FCRA licence: సోనియాగాంధీ నేతృత్వంలోని 2 ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రద్దు

పలు నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (RGF), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 

Published : 23 Oct 2022 13:11 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (RGF), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (RGCT)కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2020లో హోంశాఖ ఏర్పాటు చేసిన అంతర్‌మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ తప్పనిసరి.

ఈ ట్రస్టులకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణి (PMLA) వంటి నేరాలను మంత్రిత్వ కమిటీ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం జులై 2020లో ఏర్పాటు చేసింది. ఆదాయ పన్ను, పీఎంఎల్‌ఏ, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌పైనా దర్యాప్తు నిర్వహించినప్పటికీ.. ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దర్యాప్తు కమిటీలో హోంశాఖ, ఆర్థికశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన పలువురు అధికారులు ఉన్నారు.

2020లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆ సమయంలో ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 2005- 2009 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్‌ ఛోక్సీ వంటి వారి నుంచి అప్పట్లో ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు అందాయని.. వాటిని ఆర్‌జీఎఫ్‌కు మళ్లించారన్నారు. ఆర్‌జీఎఫ్‌ వైబ్‌సైట్‌లోని 2005- 06 వార్షిక నివేదిక ప్రకారం.. ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా కూడా ఉంది.

ఆర్‌జీఎఫ్‌ను 1991లో స్థాపించారు. ట్రస్టు వెబ్‌సైట్‌ ప్రకారం.. ఇది విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు మద్దతుగా పనిచేస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మోంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా, సుమన్‌ దూబే, అశోక్‌ గంగూలీ ఆర్‌జీఎఫ్‌కు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆర్‌జీసీటీని 2002లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేయడమే లక్ష్యంగా దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు యూపీ, హరియాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలు దిల్లీలోని పార్లమెంటు కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న జవహర్‌ భవన్‌ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని