Afghanistan: నాకు భయంగా ఉంది.. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు!

అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు మహిళలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారి హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ వారికి స్థానం కల్పించలేదు. ఈ విషయంలో నిరసన తెలుపుతున్నవారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు...

Published : 11 Sep 2021 02:36 IST

కాబుల్‌: అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు మహిళలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారి హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ వారికి స్థానం కల్పించలేదు. ఈ విషయంలో నిరసన తెలుపుతున్నవారిని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆయా జైళ్లలో బందీలుగా ఉన్న వేలాది నేరస్థులను, తీవ్రవాదులను, తాలిబన్లను విడుదల చేస్తున్నారు. దీంతో వారికి శిక్షలు వేసిన జడ్జిలకు ప్రాణభయం పట్టుకుంది. ఎక్కడ చంపేస్తారోనని దేశవ్యాప్తంగా వందలాది న్యాయమూర్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిలో దాదాపు 200కు పైగా మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘ది ఇండిపెంటెండ్‌’ తన నివేదికలో వెల్లడించింది.

మా ఇంటికి వచ్చి.. నా గురించి ఆరా తీశారు

నంగర్‌హర్‌ ప్రావిన్స్‌కు చెందిన 38 ఏళ్ల మహిళా న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆమె భయాందోళనను సదరు నివేదికలో ఉటంకించారు. ‘భార్యను హింసించినందుకుగానూ ఎనిమిది నెలల క్రితం ఒక తాలిబన్‌కు శిక్ష విధించాను. జైలు నుంచి విడుదలయ్యాక నిన్నూ అలాగే హింసిస్తానని విచారణ ముగింపు సమయంలో అతను నన్ను బెదిరించాడు. అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు అతను విడుదలయ్యాడు. నా ఆచూకీకి యత్నిస్తున్నాడు. వ్యక్తిగత వివరాలూ సేకరించాడు. చాలా సార్లు ఫోన్‌ చేశాడు. నేను మా ఇంటిని విడిచిపెట్టాక.. కొంతమంది తాలిబన్లు అక్కడికి వచ్చి, నా గురించి ఆరా తీశారు. ఒకవేళ వారు నన్ను పట్టుకుంటే చంపేయ్యొచ్చు. నాకు భయంగా ఉంది. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. ఇక్కడి 200కు పైగా మహిళ జడ్జిలదీ ఇదే దుస్థితి. మా ఉద్యోగాలు, ఆస్తులు పోయినా.. ఫర్వాలేదు. కానీ.. మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు ముఖ్యం. ఇప్పుడు ఏదైనా జరగొచ్చు. తాలిబన్లు పట్టుకుని, చంపేసేలోపే అంతర్జాతీయ సమాజం మమ్మల్ని ఆదుకోవాల’ని ఆమె విజ్ఞప్తి చేశారు.

వారికి ఇప్పుడు ఇద్దరు శత్రువులు..

మహిళా న్యాయమూర్తులకు తాలిబన్లు, నేరస్థుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని అఫ్గాన్‌లోని ఫ్యామిలీ కోర్టు మాజీ జడ్జి మర్జియా బాబాకర్‌ఖైల్ పేర్కొన్నారు. ‘నా విషయమై నా సోదరుడిని తాలిబన్లు దారుణంగా కొట్టార’ని ఓ మహిళా న్యాయమూర్తి తనతో చెప్పి వాపోయినట్లు ఆమె తెలిపారు. ‘ప్రస్తుతం మహిళా జడ్జిలకు ఇద్దరు శత్రువులు. ఒకరు తాలిబన్లు కాగ, మరొకరు నేరస్థులు. సదరు నేరస్థుల్లో ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడినవారూ ఉన్నార’ని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం లండన్‌లో నివశిస్తున్న మర్జియా.. అఫ్గాన్‌ మహిళా జడ్జీలను రక్షించేందుకు ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని