బయలుదేరిన కరోనా టీకా!

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒకప్పుడు చిగురుటాకులా వణికిన భారత్‌కు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కొవిడ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతోంది.......

Updated : 12 Jan 2021 16:05 IST

పుణె: కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒకప్పుడు చిగురుటాకులా వణికిన భారత్‌కు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కొవిడ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందుకు రంగం శరవేగంగా సిద్ధమవుతోంది. అందులో భాగంగా మంగళవారం వేకువజామున కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా బట్వాడా చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం.

తొలి విడత డోసులు పుణె నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు రానుండగా.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా టీకా డోసులను సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌కు చెందిన విమానాలను ఈ రవాణా కార్యక్రమంలో ఉపయోగిస్తోన్నట్లు తెలుస్తోంది. 

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా‌ వేస్తారు. దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. మరోవైపు భారత్‌ బయోటెక్‌ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు.

సీరం నుంచి 1.1 కోట్ల డోసులను, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల డోసులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీనికి అదనంగా.. ఏప్రిల్‌లోగా 4.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను కొనుగోలు చేయనుంది. మొత్తంమీద 3 కోట్ల మంది కరోనా యోధుల కోసం 6 కోట్లకుపైగా డోసులను కొనుగోలు చేస్తోంది. వీటి మొత్తం విలువ రూ.1300 కోట్ల మేర ఉంటుంది. సీరం సంస్థ నుంచి ఒక్కో డోసు కొవిషీల్డ్‌కు రూ.200 కాగా, రూ.10 మేర జీఎస్‌టీ దీనికి అదనమని అధికారులు తెలిపారు. ఇందుకు రూ.231 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కొవాగ్జిన్‌కు ఒక్కో డోసుకు రూ.295 చెల్లించనున్నట్లు సమాచారం. దీనికి రూ.162 కోట్లు ఖర్చవుతుంది.

ఇవీ చదవండి..

యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే

అదిగో టీకా.. లెక్క పక్కా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని