టెస్టులు చేయించుకొమ్మంటే ఖాళీ ఫ్లైట్‌తో వెనక్కి

ఇతర ప్రదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చినవారిని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షలు చేయించుకోమ్మంటే పారిపోయిన ఘటనలు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.

Updated : 24 Apr 2021 18:04 IST

దిల్లీ: ఇతర ప్రదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారిని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షలు చేయించుకొమ్మంటే పారిపోయిన ఘటనలు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా దిల్లీ విమానాశ్రయంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అమెరికా నుంచి భారత్‌కు విమానం తీసుకొచ్చిన సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా.. అందుకు నిరాకరించిన ఆ సిబ్బంది ఖాళీ విమానంతో వెనక్కి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దిల్లీ ఎయిర్‌పోర్టుల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. వెంటనే వెళ్లిపోయే విమానాలు మినహా ఇతర దేశాల ఎయిర్‌లైన్‌ సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందే. నిన్న న్యూయార్క్‌ నుంచి యునైటెడ్‌ ఎయిర్‌లైన్‌ విమానం ఒకటి దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ విమానం వెంటనే తిరుగు ప్రయాణమయ్యే జాబితాలో లేకపోవడంతో అందులోని సిబ్బంది ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. కానీ యునైటెడ్‌ ఎయిర్‌లైన్‌ క్రూ సభ్యులు టెస్టులు చేయించుకోలేదు సరికదా.. ప్రయాణికులెవరినీ ఎక్కించుకోకుండానే ఖాళీ విమానంతో న్యూయార్క్‌కు వెళ్లిపోయారు.

ఇందుకు గల కారణాన్ని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారికంగా చెప్పనప్పటికీ.. స్థానిక అధికారుల ప్రయాణ నిబంధనల వల్ల ఏప్రిల్‌ 23న దిల్లీ- న్యూయార్క్‌  విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. అంతేగాక, ఏప్రిల్‌ 25 వరకు భారత్‌కు విమాన సేవలను యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ నిలిపివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని