ఇండోనేసియాలో వరదలు.. 44మంది మృతి

ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ దాదాపు 44 మంది మృతి చెందారు..

Updated : 04 Apr 2021 16:40 IST

జకార్తా: ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ దాదాపు 44 మంది మృతి చెందారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

మృతుల్లో ఎక్కువ మంది ఫ్లోర్స్‌ ద్వీపంలోని తూర్పు నుసా టెంఘరా ప్రావిన్సుకు చెందినవారు. కొండ ప్రాంతంలో ఉన్న లామినేలే అనే గ్రామంలో ఇళ్లపైకి అర్ధరాత్రి ఒక్కసారిగా చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. ఈ ఘటనలో 38 మంది మరణించారు. మరో ఐదుగురిని సహాయక బృందాలు సురక్షితంగా వెలికి తీశాయి. కొంతసమయం తర్వాత వరదలు బురదను తుడిచిపెట్టేశాయి. అప్పటి వరకు మృతదేహాలు బురదలోనే కూరుకుపోయి ఉన్నాయి. అలాగే వేబురాక్‌ అనే మరో గ్రామంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ మొత్తం ముగ్గురు మరణించగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు.

అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో నదులన్నీ పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలోనే వరదలు ముంచెత్తాయి. నది పరీవాహన ప్రాంతంలోని సారవంతమైన భూముల్లో సాగు నిమిత్తం స్థిరపడ్డ గ్రామాలన్నీ తాజా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇండోసేసియాలో ఏటా వచ్చే వరదలు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. దాదాపు 17,000 ద్వీపాల సమాహారమైన ఈ దేశంలో కొండ ప్రాంతాలే అధికం. దీంతో ఆకస్మికంగా వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిణామాలు తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని