Osama Bin Laden: బిన్‌ లాడెన్‌ ‘ప్రపంచ ఉత్తమ ఇంజినీర్‌’.. కొనియాడిన ఉద్యోగి సస్పెండ్‌!

అమెరికా చేతిలో హతమైన వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను ‘ప్రపంచపు ఉత్తమ ఇంజినీర్‌’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కొనియాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది.......

Published : 02 Jun 2022 01:46 IST

లఖ్‌నవూ: యావత్‌ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. అమెరికా చేతిలో హతమైన వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను ‘ప్రపంచపు ఉత్తమ ఇంజినీర్‌’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కొనియాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. అంతేకాకుండా ఉగ్రవాది ఫొటోను తన కార్యాలయంలో పెట్టుకోవడం గమనార్హం. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. చివరకు ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దక్షిణాంచల్‌ విద్యుత్‌ విత్రాన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (DVVNL)లో సబ్‌-డివిజినల్‌ ఆఫీసర్‌ (SDO)గా రవీంద్ర ప్రకాశ్‌ గౌతమ్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటోను తన కార్యాలయంలో పెట్టుకోవడమే కాకుండా ‘గౌరవనీయులైన ఒసామా బిన్‌ లాడెన్‌, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్‌ ఇంజినీర్‌’ అంటూ ఉగ్రవాదిని కీర్తిస్తూ రాసుకున్నాడు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రవీంద్ర ప్రకాశ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయంలోని లాడెన్‌ ఫొటోను తొలగించి.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపనున్నట్లు ఫరూఖాబాద్‌ కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు.

అయితే, సస్పెండైన అధికారి మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. ‘ఎవరైనా ఆదర్శంగా ఉండవచ్చు. ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్‌ ఇంజినీర్‌. ఆఫీస్‌లోని ఫొటోను తొలగించారు. కానీ, అటువంటి కాపీలు నా దగ్గర చాలా ఉన్నాయి’ రవీంద్ర ప్రకాశ్‌ చెప్పడం గమనార్హం. అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూల్చి దాదాపు 3వేల మందిని పొట్టనబెట్టుకున్న అల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి అబొట్టాబాద్‌ కంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను మట్టుబెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని