Tihar Jail: క్షీణిస్తోన్న సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యం.. 35కిలోల బరువు తగ్గిన మాజీమంత్రి!

దిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ (Satyendar Jain) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో జైలు (Tihar Jail) అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Updated : 22 May 2023 16:49 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో అరెస్టై, తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ (Satyendar Jain) తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను నగరంలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండటంతోనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. జైలు (Tihar Jail) సెల్‌లో ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నానని ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తిహాడ్‌ జైల్లో ఉన్న సత్యేందర్‌ జైన్‌.. పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట లభించడంలేదు. ఈ క్రమంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో గతవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున పిటిషన్‌ వేసిన సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వీ.. జైల్లో ఉన్న సమయంలో జైన్‌ 35కిలోల బరువు తగ్గారని, ప్రస్తుతం ఆయన అస్థిపంజరంగా మారిపోయారని ధర్మాసనం ముందు విన్నవించారు. పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ అత్యవసర విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్‌ జైన్‌ గతేడాది మే 30 నుంచి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో తొలుత దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ట్రయల్‌ కోర్టు 2022, నవంబర్‌ 17న కొట్టివేసింది. అనంతరం తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఈఏడాది ఏప్రిల్‌లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయ్యింది. దీనిని సవాలు చేస్తూ మే 15న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇదిలాఉంటే, ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నానని.. తానుంటున్న గదిలో ఇద్దరు వ్యక్తుల్ని తోడుగా ఉంచాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్‌కు జైన్‌ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీంతో జైన్‌కు తోడుగా ఉండేందుకు ఆయన సెల్‌లోకి ఇద్దరు ఖైదీలను బదిలీ చేయడం వివాదాస్పదమయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని