Manipur: మణిపుర్‌లో మరోసారి ఉగ్రవాదుల కాల్పులు.. విచారణ ప్రారంభించిన సీబీఐ!

మణిపుర్‌ (Manipur) ఆందోళనల్లో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు కేంద్రం ₹ 101.75 కోట్లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన 24 గంటల్లోనే రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. 

Published : 09 Jun 2023 23:58 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. పశ్చిమ ఇంఫాల్‌  ప్రాంతానికి సమీపంలో ఉన్న కాంగ్‌పోక్పి (Kangpokpi) జిల్లాలోని ఖోకెన్‌ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ సహా ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆర్మీ సిబ్బంది ఉపయోగించే వాహనాల్లో ఖోకెన్‌ గ్రామంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆటోమేటిక్‌ ఆయుధాలతో గ్రామస్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిని గిరిజన నాయకుల ఫోరం (ITLF) తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 

‘‘ఇది పూర్తిగా నిర్లక్ష్యపూరిత చర్య. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇచ్చిన పిలుపును తిరుగుబాటుదారులు ఉల్లఘించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం’’ అని ఐటీఎల్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామంలో మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే, మరింత రక్తపాతం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని, అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. 

గత నెల రోజులుగా తెగల మధ్య ఘర్షణలతో మణిపుర్‌ అట్టుడుకుతోంది. శాంతిని పునరుద్ధరించడంలో భాగంగా గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించి పౌర సంఘాలతోపాటు విద్యార్థి సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. మరోవైపు, రాష్ట్రంలో జరిగిన అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు రూ.101.75 కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. మణిపుర్‌లో పరిస్థితులు గడిచిన 48 గంటల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్‌ సింగ్ గురువారం ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన 24 గంటల్లోపే కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

రంగంలోకి సీబీఐ

మణిపుర్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. హింసాత్మక ఘటన వెనుక ఉన్న కుట్రకోణంపై విచారణ జరిపేందుకు సిట్‌ను నియమించింది. అంతకుముందు రాష్ట్రంలో జరిగిన హింసకు సంబంధించి మణిపుర్‌ పోలీసులు 3,700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో ఎక్కువ శాతం పశ్చిమ ఇంఫాల్‌, కాంగ్‌పోక్పి, బిష్ణుపూర్‌ జిల్లాల్లో నమోదయ్యాయి. మొత్తం రాష్ట్రంలో సుమారు 100 ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. 35 వేల మంది నిరాశ్రయులు అయినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని