G-7: ప్రపంచానికి బిలియన్‌ డోసుల భరోసా!

కరోనా విజృంభణ, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్యదేశాలు....

Updated : 11 Jun 2021 14:33 IST

లండన్‌: కరోనా విజృంభణ, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో జి-7 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్యదేశాలు నిర్ణయించనున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు  కొవిడ్‌తో అతలాకుతలమవుతున్న తరుణంలో ధనిక దేశాలు మిగులు టీకాలను నిల్వ చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జి-7 కూటమి నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వచ్చే సంవత్సరం నాటికి 100 మిలియన్ మిగులు కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేస్తామని బ్రిటన్‌ హామీ ఇచ్చింది. వీటిలో కొన్నింటినీ వచ్చే కొన్ని వారాల్లోనే అందజేస్తామని తెలిపింది. దాదాపు 400 మిలియన్ డోసులకు ఆర్డర్లు పెట్టిన బ్రిటన్‌.. పేద దేశాలకు అండగా నిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జి-7 వేదికగా ఆ అపవాదును తుడిచేసుకునే ప్రయత్నం చేశారు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. యూకేలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైన కారణంగా.. మిగులు టీకాలను ఇతర దేశాలకు పంచే స్థితికి చేరుకున్నామని ప్రకటించారు. జి-7 కూటమిలోని ఇతర దేశాలు సైతం ఇదే తరహాలో సాయానికి ముందుకు వస్తాయని ఆకాంక్షించారు. అనంతరం బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఒక బిలియన్ డోసుల పంపిణీకి దేశాధినేతలు అంగీకరించనున్నారని ఆ ప్రకటన వెల్లడించింది.

సెప్టెంబరు నాటికి ఐదు మిలియన్ డోసుల్ని, 2021 చివరి నాటికి 25 మిలియన్లు, 2022 నాటికి 95 మిలియన్‌ డోసుల్ని పంపిణీ చేస్తామని బ్రిటన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. వీటిలో 80 శాతం టీకాలు డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో టీకాల పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్‌ కూటమికి వెళతాయని పేర్కొంది. మిగిలినవి ద్వైపాక్షిక మార్గాన ఆయా దేశాలకు చేరుకుంటాయని వెల్లడించింది. మరోవైపు 500 మిలియన్‌ డోసుల్ని పేద దేశాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు అమెరికా గురువారం ప్రకటించింది. అలాగే ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలు 2021 చివరి నాటికి 100 మిలియన్‌ డోసుల్ని పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఇందులో ఫ్రాన్స్‌ 30 మిలియన్‌ డోసులు, జర్మనీ 30 మిలియన్‌ డోసులు ఇస్తామని హామీ ఇచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని