పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా ననన్‌కానా సాహెబ్‌ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి.........

Published : 04 Jan 2020 11:24 IST

దిల్లీ: పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్‌కానా సాహెబ్‌ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. గురుద్వారాను రక్షించాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందని గుర్తుచేసింది. అక్కడ చిక్కుకున్న సిక్కులకు రక్షణ కల్పించాలని కోరింది. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించడంతో పాటు అక్కడి భక్తులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, శిరోమణి అకాళీ దళ్‌ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.  

అసలేం జరిగింది..?

పోలీసుల వివరాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబరులో హసన్ అనే యువకుడు సిక్కు వర్గానికి చెందిన ఓ అమ్మాయిని అపహరించి వివాహం చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా మతమార్పిడి చేయించాడు. దీంతో బలవంతపు మతమార్పిడుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హసన్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హసన్ కుటుంబ సభ్యుల కొంతమంది మద్దతుతో గురుద్వారాకు సమీపంలో నిరసనకు దిగారు. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడడంతో భారత ప్రభుత్వం స్పందించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

గురుద్వారాపై దాడి జరగలేదు: పాక్‌

దీనిపై పాక్‌ వాదన మరోలా ఉంది. గురుద్వారాపై ఎవరూ దాడి చేయలేదని చెప్పుకొచ్చింది. రెండు ముస్లిం వర్గాల మధ్య నన్‌కానా సాహెబ్‌లోని ఓ టీ స్టాల్‌ వద్ద ఘర్షణ తలెత్తినట్లు వివరించింది. స్థానిక యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. దీన్ని కావాలనే కొంతమంది మతపరమైన అల్లర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది.

గురుద్వారా నన్‌కానా సాహెబ్‌ని సిక్కుల మత గురువు గురునానక్‌ జన్మస్థలంగా సిక్కులు భావిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని