దిల్లీ ఓటరు తీర్పు ఎటు?

దేశ రాజధాని దిల్లీ నగరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను 67 సీట్లతో ఘనవిజయం సాధించిన ఆమ్‌ ఆద్మా పార్టీ మరోసారి గెలుపునకు యత్నిస్తుండగా ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భాజపా శ్రమిస్తోంది. 

Updated : 06 Jan 2020 20:21 IST

దేశ రాజధాని దిల్లీ నగరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను 67 సీట్లతో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి గెలుపునకు యత్నిస్తుండగా ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భాజపా శ్రమిస్తోంది. 

ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి..
తాము అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించామని చెబుతూ కొన్నిరోజుల ముందు రిపోర్ట్‌కార్డు విడుదలచేశారు ఆప్‌ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. 2015లో అధికారం చేపట్టినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ. 31 వేల కోట్లు ఉండగా తాము తీసుకున్న చర్యల కారణంగా రూ. 60 వేల కోట్లకు చేరందని తెలిపారు. దీంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆసుపత్రులు, వందలాది పాఠశాల భవనాలు నిర్మించామని చెప్పారు. దిల్లీ ఈ ఐదేళ్లలో అభివృద్ధి చెందినట్టుగా ఎప్పుడూ అభివృద్ధి చెందలేదన్నారు. మహిళల భద్రత కోసం బస్సుల్లో మార్షల్స్‌ను నియమించడంతో పాటు వారికి ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ఓటర్లు ఆప్‌కు మద్దతు పలుకుతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఆప్‌ చేసిందేమీ లేదు: భాజపా
ఈ ఐదేళ్లలో ఆప్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా విమర్శిస్తోంది. నగరంలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను తాము గెలుచుకున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలు, వెంటిలేటర్ల కొరత ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో వృథా చేసిందని దుయ్యబట్టారు. అనధికార కాలనీల రెగ్యులరైజ్‌ చేసేందుకు ఆప్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని భాజపా తెలిపింది. కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే అనధికార కాలనీలు రెగ్యులరైజ్‌ అవుతున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం 7 సీట్లను గెలుచుకున్న అంశాన్ని కమలనాథులు ప్రస్తావిస్తున్నారు. ఆప్‌ ప్రయోగం దేశ రాజకీయాల్లో ఒక విఫలం అని విరుచుకుపడుతున్నారు.

ఆప్‌తో కలుద్దామా వద్దా?

దిల్లీలో వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆప్‌తో కలసి పోటీచేయాలా? వద్దా? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. దివంగత నేత షీలాదీక్షిత్‌ ఉన్న సమయంలో ఆమె పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారు. ఆమె తరువాత ఆ స్థానాన్ని భర్తీచేసే నేత లేకపోవడం ఆ పార్టీకి నష్టమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటును కూడా గెలవలేదు. 

ఉత్కంఠ పోరు తప్పదు..
భాజపా, ఆప్‌ల మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశముంది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లు మద్దతిచ్చే అవకాశముంది. ఉత్తర భారతంలో దిల్లీ పెద్ద నగరం కావడంతో నిత్యం వేలాదిమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా వస్తుంటారు. వీరి ఓట్లతో పాటు పంజాబీలు, తదితరుల ఓట్లు  విజయావకాశాలపై గణనీయంగా ప్రభావం చూపుతాయి. భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీతో పాటు పార్టీ అధినేత అమిత్‌షా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏది ఏమైనా దిల్లీ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తుంటారు. మరి ఈ సారి ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందే.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని