88 ఏళ్ల తర్వాత గుర్రాలతో గస్తీ..!

దాదాపు 88 ఏళ్ల తర్వాత ముంబయిలో పోలీసులు గుర్రాలపై గస్తీ కాయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసుల దళాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది.........

Published : 20 Jan 2020 11:25 IST

ముంబయి: దాదాపు 88 ఏళ్ల తర్వాత ముంబయిలో పోలీసులు గుర్రాలపై గస్తీ కాయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. ట్రాఫిక్‌, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు గుర్రాలపై గస్తీ కాయనున్నారని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. ఈ తరహా విధానం 1932కు ముందు ఉండేది. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా దీన్ని అప్పట్లో రద్దు చేశారు. ‘‘ముంబయి పోలీసుల విభాగంలో నేడు అత్యాధునిక జీపులు, మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. అయినా రద్దీ ఉన్న ప్రాంతాల్లో గస్తీ కాసేందుకు గుర్రాలతో కూడిన పోలీసుల బృందాలు అవసరం అని తేల్చాం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ముంబయిలో ఈ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి’’ అని అనిల్‌ దేశ్‌ముఖ్‌ వివరించారు. 

పండుగలు, ప్రత్యేక రోజుల్లో జరిపే ర్యాలీలు, ప్రదర్శనల సమయంలో గుర్రాలపై గస్తీ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అనిల్‌ తెలిపారు. ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల నిఘా సులభం అవుతుందన్నారు. గుర్రంపై ఎక్కి విధులు నిర్వర్తించే ఒక్క పోలీసు నేలపై ఉండే 30 మందితో సమానమని అభిప్రాయపడ్డారు. పుణె, నాగ్‌పూర్ వంటి నగరాల్లోనూ ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 13 గుర్రాలు ఉన్నాయని ఆరు నెలల్లో ఆ సంఖ్యను 30కి పెంచుతామని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఈ దళంలో ఓ ఎస్సై, ఒక అసిస్టెంట్‌ పీఎస్‌ఐ, నలుగురు హవల్దార్లు, 32 మంది కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని