నిర్భయ దోషుల పిటిషన్లు కొట్టివేత

నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్‌ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై

Updated : 25 Jan 2020 15:25 IST

దిల్లీ:  నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్‌ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శనివారం దిల్లీ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జైన్‌ విచారణ జరిపారు. వినయ్‌కు సంబంధించిన డైరీ, పెయింటింగ్స్‌ను తీహాడ్‌ జైలు అధికారులు తనకు ఇవ్వలేదని దోషుల తరఫు న్యాయవాది ఆరోపించారు. దిల్లీ పోలీసుల తరఫున వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాట్లాడుతూ దోషుల తరఫు న్యాయవాదికి అవసరమైన అన్ని పత్రాలను తీహాడ్‌ జైలు అధికారులు అందించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు వాళ్లు ఇటువంటి పిటిషన్లు వేసి సమయాన్ని వృథా చేస్తున్నారని పేర్కొన్నారు. తీహాడ్‌ జైలు అధికారులతో న్యాయస్థానం ఏకీభవించింది. 

తొలుత దోషుల తరఫున హాజరైన న్యాయవాది ఏపీ సింగ్‌ తన వాదనలను వినిపించారు. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మపై విష ప్రయోగం జరిగిందని ఆయన ఆరోపించారు. అందుకే అతడిని ఆస్పత్రిలో చేర్పించారని.. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి మెడికల్‌ రిపోర్టులను అధికారులు ఇవ్వలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం వినయ్‌ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. అతడు జైల్లో ఆహారం కూడా తీసుకోవడం లేదని కోర్టుకు తెలియజేశారు. అధికారులు అతడి మెడికల్ రిపోర్టులు ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు ఉపయోగపడతాయని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.

తీహాడ్‌ జైలు అధికారులు దోషులకు సంబంధించిన పత్రాలు ఇవ్వడం ఆలస్యం చేయడం వల్లే వినయ్‌ కుమార్‌ క్షమాభిక్ష, అక్షయ్‌కుమార్‌, పవన్‌ సింగ్‌ క్యురేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయలేకపోయారని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది నిన్న దిల్లీ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. గతంలో వినయ్‌, ముకేశ్‌ సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోగా దాన్ని తిరస్కరించారు. దీంతో ముకేశ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు ఇటీవల డెత్‌ వారెంట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని