అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం 

అమెరికాలోని అలబామాలో అగ్నిప్రమాదం చోటుచేసుకోని ఎనిమిది మంది మృతిచెందారు. ఉత్తర అలబామాలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం వేకువ జామున టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన

Updated : 28 Jan 2020 06:32 IST

అలబామా: అమెరికాలోని అలబామాలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఎనిమిది మంది మృతిచెందారు. ఉత్తర అలబామాలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం వేకువ జామున టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్లు  ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్కాట్స్‌బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్‌ మాట్లాడుతూ.. చాలా మంది గల్లంతయ్యారని, పడవల్లో ఎంత మంది ఉన్నారో తెలియదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. 

మొదట సోమవారం అర్ధరాత్రి దాటాక  జాక్సన్‌ కంట్రీ పార్క్‌కు అంటుకున్న మంటలు ఆ తర్వాత డాక్‌యార్డు వైపునకు వేగంగా విస్తరించాయి. పడవల్లో ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అంతేకాకుండా అవి ఎక్కువగా చెక్కలతో నిర్మితం కావడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. పడవలపై ఉండే అల్యూమినియం రేకులు విరిగిపడుతుండటంతో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు టెన్నెస్సీ నదిలో దూకారు. నీటిలో దూకిన పలువురుని అధికారులు రక్షించారు. 15 నుంచి 20 నిమిషాల్లోపే డాక్‌యార్డ్‌ మొత్తం మంటల్లో చిక్కుకుందని స్థానికులు తెలిపారు. చాలా పడవల్లో గ్యాస్‌ ట్యాంకులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని