
జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం
దిల్లీ: దిల్లీలోని జామియా విశ్వవిద్యాలయ ప్రాంతంలో గురువారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. సీఏఏకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నుంచి రాజ్ఘాట్కు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీలో గత నెలలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.