‘మా అమ్మకు చపాతీలో లేఖ పెట్టి పంపా’

కశ్మీర్‌: నిర్భందంలో ఉన్న తన తల్లికి చపాతీలో లేఖలు పెట్టి పంపించినట్లు జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తెలిపారు. గత ఆరు నెలలుగా మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్భందంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో తన తల్లితో

Published : 07 Feb 2020 14:20 IST

మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా

కశ్మీర్‌: నిర్బంధంలో ఉన్న తన తల్లికి చపాతీలో లేఖలు పెట్టి పంపించినట్లు జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తెలిపారు. గత ఆరు నెలలుగా మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో తన తల్లితో మాట్లాడేందుకు వీలు లేకపోవడంతో చపాతీలో లేఖలు పెట్టి పంపించానని.. వాటి ద్వారానే తాము మాట్లాడుకున్నామని ఇల్తిజా తెలిపారు.

కశ్మీర్‌లోని ప్రజలు తమ ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలను వాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఫ్తీపై కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు ఇల్తిజా ట్విటర్‌లో ఓ లేఖను పోస్టు చేశారు. ‘నా తల్లిని అరెస్టు చేసి తీసుకెళ్లిన రోజును నేను ఎప్పటికీ మరువలేను. నేను తీవ్ర ఆందోళనకు లోనయ్యాను. కానీ ఒక రోజు మా అమ్మకు ఇంటి నుంచి పంపించిన టిఫిన్‌ బాక్స్‌లో ఓ లేఖ కనిపించింది. మా అమ్మ నాకు ఉత్తరం రాసి అందులో పెట్టి పంపించింది. నేను మాట్లాడేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించలేను. లవ్‌ యూ, మిస్‌ యూ అని అందులో రాసి ఉంది. ఆ తర్వాత దానికి ఎలా జవాబు పంపించాలో నాకు అర్థం కాలేదు. అందుకు మా బామ్మ ఓ ఐడియా ఇచ్చింది. ఓ చిన్న పేపరులో రాసి దాన్ని జాగ్రత్తగా చపాతీ రోల్‌లో మడిచి పెట్టి పంపించాను’ అని ఆమె తెలిపారు. 

ప్రస్తుతం ముఫ్తీ  శ్రీనగర్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నిర్బంధంలో ఉన్నారు. గతేడాది ఆగస్టు 5న జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాతో పాటు అనేక మంది నేతలను గృహ నిర్బంధం చేశారు. తొలుత ఆమెను ఛష్మషాహి గెస్ట్‌ హౌస్‌కు తీసుకెళ్లగా డిసెంబరులో అక్కడి నుంచి శ్రీనగర్‌ ప్రభుత్వ బంగ్లాకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని