కొవిడ్‌: 1662కు చేరిన మృతుల సంఖ్య

చైనా ప్రజల పాలిట మృత్యుశాపంగా మారిన కొవిడ్‌-19 విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజృంభణ మాత్రం ఆగడం లేదు..........

Updated : 16 Feb 2020 10:36 IST

బీజింగ్‌: చైనా ప్రజల పాలిట మృత్యుశాపంగా మారిన కొవిడ్‌-19 విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజృంభణ మాత్రం ఆగడం లేదు. తాజాగా చైనాలో మరో 139 మందిని ఈ మహమ్మారి బలిగొంది. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందిన వారే. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,662కు చేరింది. మరో 1,843 మంది కొత్తవారికి ఈ వైరస్‌ సోకింది. వరుసగా మూడోరోజు ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య స్వల్పంగా తగ్గడం కొంతమేర ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 69,000 దాటింది. ఇక వైరస్‌ నుంచి 9,465 మంది విముక్తి పొందారు. తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. చైనా సహా ఇతర ఆసియా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని సంస్థ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. అలాగే చైనాలో వైరస్ బాధితుల్ని గుర్తిస్తున్న విధానంపై ప్రభుత్వాన్ని వివరణ కోరామని తెలిపారు. 

* జపాన్‌ నౌకలో ఉన్న అమెరికా పౌరుల్ని తీసుకెళ్లేందుకు ఆ దేశం ఈరోజు ప్రత్యేక విమానం పంపనుంది. దాదాపు రెండు వారాల నుంచి వారు నౌకలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నౌకలో 285 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

* కాంబోడియా తీరంలో ఆగిన మరో నౌక వెస్టర్‌డ్యామ్‌లో ఓ అమెరికా మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే అందులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

* సింగపూర్‌లో మరో ఐదుగురికి వైరస్‌ సంక్రమించింది. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 72కు ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని