జైల్లో నిర్భయ దోషి నిరాహార దీక్ష

నిర్భయ కేసులో ‘ఉరి’ వాయిదా పడేలా చేసేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తిహాడ్‌ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్‌

Published : 17 Feb 2020 15:38 IST

ఉరి వాయిదా పడేలా దోషుల ప్రయత్నాలు

దిల్లీ: నిర్భయ కేసులో ‘ఉరి’ వాయిదా పడేలా చేసేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తిహాడ్‌ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్‌ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో దోషి అక్షయ్‌ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు. 

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం ఇటీవల దిల్లీ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ నిరాహార దీక్ష చేపట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో చట్టపరంగా అతడి పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తి జైలు సూపరిండెంట్‌ను ఆదేశించారు. మరోవైపు వినయ్‌ శర్మ తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేయలేమని వినయ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

ఇక మిగిలిన దోషులు కూడా ఉరి వాయిదా పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దోషి అక్షయ్‌ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు అతడి తరఫున న్యాయవాది తెలిపారు. దోషి పవన్‌ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అతడు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోనున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. తన తరఫున న్యాయవాది బృందా గ్రోవర్‌ వాదించడం తనకు ఇష్టం లేదని మరో దోషి ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దిల్లీ కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ స్థానంలో అడ్వొకేట్‌ రవీ ఖాజీని న్యాయస్థానం నియమించింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని