పాక్‌లో బాంబు పేలితే ఇక్కడ ధర్నాలా?

‘పాకిస్థాన్‌ స్కూల్‌లో బాంబు పేలింది అని.. నేపాల్‌లో భూకంపం వచ్చింది అని భారత్‌లో ధర్నాలు చేయడం ఏంటీ?’ అంటూ ఉత్తరాఖండ్‌లోని కొందరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

Updated : 09 Dec 2021 16:42 IST

ఉత్తరాఖండ్‌ న్యాయవాదులపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: ‘పాకిస్థాన్‌ స్కూల్‌లో బాంబు పేలింది అని.. నేపాల్‌లో భూకంపం వచ్చింది అని భారత్‌లో ధర్నాలు చేయడమేంటీ?’ అంటూ ఉత్తరాఖండ్‌లోని కొందరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, హరిద్వార్‌, ఉదమ్‌ సింగ్‌ నగర్‌లోని కొన్ని కోర్టుల్లో గత 35ఏళ్లుగా కొందరు న్యాయవాదులు ప్రతి శనివారం విచిత్ర కారణాలతో ధర్నాలు, విధుల బహిష్కరణకు దిగుతున్నారట. లా కమిషన్‌ చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. లాయర్ల ధర్నాలు కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించడమేగాక, పెండింగ్‌ కేసులు నానాటికీ పెరిగిపోయాయి. దీంతో న్యాయ కమిషన్‌ ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించింది. 

2012-16 మధ్యకాలంలో డెహ్రాడూన్‌ జిల్లాలో న్యాయవాదులు మొత్తంగా 455 రోజులు ధర్నాలు చేయగా.. హరిద్వారా జిల్లాలో 515 రోజులు లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళనలకు దిగినట్లు లా కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఇక న్యాయవాదుల ధర్నాకు గల కారణాలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి. పాకిస్థాన్‌ స్కూల్‌లో బాంబు పేలిందని, శ్రీలంకలో రాజ్యాంగ సవరణలు చేశారని, నేపాల్‌లో భూకంపం వచ్చిందని, ఆ భూకంపంలో న్యాయవాదుల బంధువులు చనిపోయారని, భారీ వర్షాలు కురిశాయని, కవి సమ్మేళనాలు జరుగుతున్నాయని ఇలా అసంబద్ధ కారణాలతో లాయర్లు ఆందోళనలు చేపట్టినట్లు నివేదిక వెల్లడించింది. 

నివేదికను పరిశీలించిన హైకోర్టు సదరు న్యాయవాదులపై ఆగ్రహించింది. ఇలాంటి ధర్నాలు చట్టవిరుద్ధమని తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ధర్నాలపై విచారం వ్యక్తం చేసింది. ‘ఇలాంటివి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. న్యాయవాదులు ప్రతి శనివారం ధర్నాలు చేయొచ్చని బార్‌ అసోసియేషన్‌ ఎలా చెబుతుంది? న్యాయవాదుల కుటుంబసభ్యులు చనిపోతే లాయర్లంతా ఎలా ఆందోళన చేస్తారు. ఇదేమైనా జోకా..? ఇలాంటి వాటిని మేం ఎన్నటికీ అనుమతించబోం. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా న్యాయపరమైనదే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని