
చైనాకు బిల్గేట్స్, జాక్మా భారీ విరాళం..!
కరోనాను ఎదుర్కొనేందుకు టెక్ కంపెనీల సాయం
బీజింగ్: కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చైనాకు సాయం అందించేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకొచ్చాయి. ప్రపంచ కుబేరులు కూడా చైనాకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ప్రపంచ సంపన్నులైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్మా చేరారు. బిల్ గేట్స్ తన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్’ ఫౌండేషన్ తరపున దాదాపు 100మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దాదాపు 14.5 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని వెల్లడించింది. వైరస్ను గుర్తించడం, బాధిత ప్రజలకు చికిత్స అందించడంతో పాటు వాక్సిన్ అభివృద్ధికి ఈ విరాళం సహాయపడుతుందన్నారు. అయితే గత జనవరిలో ప్రకటించిన 10మిలియన్ డాలర్లతో కలుపుకొని ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్లు జాక్మా పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆలీబాబా గ్రూప్ కంపెనీ దాదాపు 145 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. దీనితో పాటు పరిశోధనలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామని తెలిపింది. వీరిద్దరే కాకుండా, చైనాలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా ఉన్న టెన్సెంట్(వీచాట్ మాతృసంస్థ)కూడా 42మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. మరో సంస్థ కెరింగ్ గ్రూప్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులను హుబే ప్రావిన్సులోని రెడ్క్రాస్ ఫౌండేషన్ ద్వారా ఖర్చుచేయనున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.