సీఏఏపై భయం అవసరం లేదు: ఉద్ధవ్‌

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త..........

Published : 21 Feb 2020 20:34 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) చేపట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. తన తనయుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రధాని మోదీని ఉద్ధవ్‌ శుక్రవారం కలిశారు. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత ప్రధాని మోదీతో ఉద్ధవ్‌ తొలిసారి భేటీ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ వంటి అంశాలపై చర్చించామని భేటీ అనంతరం ఉద్ధవ్‌ మీడియాతో చెప్పారు.

‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ గురించి మోదీతో చర్చించాం. ఇప్పటికే వీటిపై నా వైఖరి ఏంటో చెప్పాను. సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీని వల్ల మైనారిటీలు లబ్ధి పొందుతారు. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ నిర్వహించబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎన్‌పీఆర్‌ వల్ల దేశం నుంచి ఎవరినీ పంపించడం జరగదు’’ అని ఉద్ధవ్‌ అన్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా అఘాడీ’ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలనను పూర్తి చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని ఉద్ధవ్‌ తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, భాజపా సీనియర్‌ నేత అడ్వాణీతో సైతం ఉద్ధవ్‌  భేటీ కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని