
దిల్లీ చేరుకున్న ట్రంప్..తొలిరోజు సాగిందిలా!
దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు దిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్ నుంచి బయల్దేరి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్, మెలానియా దంపతులు తొలి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత అంతర్జాతీయ విమానాశ్రయంలో చేరుకున్న ట్రంప్, మెలానియా దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు ప్రపంచ అగ్రరాజ్య అధిపతికి అడుగడుగునా స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్రమాలను వేశారు. అనంతరం ట్రంప్, మెలానియా చరఖాను తిప్పారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. అక్కడి నుంచి మోతెరా మైదానానికి చేరుకొని ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విమానంలో ఆగ్రాకు బయల్దేరారు. తాజ్మహల్ అందాలను తిలకించిన ట్రంప్ దంపతులు.. ఆ పురాతన పాలరాతి కట్టడం విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఆయన కుమార్తె, ఇవాంక, అల్లుడు కుష్నర్ ఉన్నారు.
ట్రంప్ రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయనకు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ట్రంప్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మోదీ, ట్రంప్ పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. పర్యటనలో చివరిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయిన తర్వాత ట్రంప్ అమెరికాకు తిరుగు పయనం కానున్నారు.