మెలానియా మదిని వీడని భారత్‌ జ్ఞాపకాలు..!

భారత పర్యటన ముగిసి మూడు రోజులు గడుస్తున్నా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇక్కడి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పర్యటన విజయవంతమవడానికి.........

Published : 29 Feb 2020 10:59 IST

దిల్లీ: భారత పర్యటన ముగిసి మూడు రోజులు గడుస్తున్నా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇక్కడి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పర్యటన విజయవంతమవడానికి సహకరించిన ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించే అవకాశం దక్కినందుకు గౌరవంగా భావిస్తున్నామన్నారు. ‘‘ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాం. గాంధీ స్ఫూర్తిని స్మరించుకుంటూ అక్కడ మొక్కను నాటడం మరచిపోలేని సందర్భం. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్‌కు ధన్యవాదాలు. ఇరుదేశాల మధ్య మైత్రిని చాటేందుకు గొప్ప సందర్భం లభించింది’’ అని మెలానియా ట్వీట్‌ చేశారు. పర్యటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. అలాగే దిల్లీ సర్వోదయ పాఠశాల చిన్నారులను కలవడం ఆనందంగా ఉందంటూ.. వారు ఎప్పటికీ ఇలాగే రాణించాలని ఆకాంక్షించారు. దిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆ దేశ సిబ్బందిని కలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. భారత్‌లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ నెల 24, 25వ తేదీల్లో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలనియా భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ గడిపిన క్షణాల్ని ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు. సర్వోదయ పాఠశాలలో గడిపిన క్షణాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని గురువారం ఆమె గుర్తుచేసుకున్నారు. తాజాగా రాష్ట్రపతి భవన్‌, రాజ్‌ఘాట్‌ సందర్శనను నెమరువేసుకున్నారు. అంతకుముందు తాజ్‌మహల్ ప్రాశస్త్యాన్ని చాటే వీడియోను ట్విటర్‌లో పంచుకున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని