అందరికీ న్యాయం చేయడం మా కర్తవ్యం:మోదీ

ప్రజల కోసం తమ ప్రభుత్వం శ్రమిస్తున్నంతగా.. గత ప్రభుత్వాలేవీ పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సమానంగా పనిచేయడమే తమ తొలి ప్రాధాన్యం అన్నారు...........

Updated : 29 Feb 2020 14:46 IST

ప్రయాగ్‌రాజ్‌: ప్రజల కోసం తమ ప్రభుత్వం శ్రమిస్తున్నంతగా.. గత ప్రభుత్వాలేవీ పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల కోసం సమానంగా పనిచేయడం, అందరికీ న్యాయం చేయడమే తమ తొలి ప్రాధాన్యం అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం జరిగిన ఓ సభలో ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా విశ్వాస్‌’ విధానాన్ని పునరుద్ఘాటించారు. అంతకుముందు ఆయన దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన ప్రత్యేక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గతంలో ఉపకరణాలను పొందడం కోసం దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదన్నారు. దీన్ని ఏమాత్రం సహించని తమ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు సేవ చేయడం తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం రూ.900 కోట్ల విలువ చేసే ఉపకరణాలను పంపిణీ చేసిందని తెలిపారు. 

అంతకుముందు సభకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులతో మోదీ మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సేవకుడి హోదాలో దివ్యాంగులందరికీ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మీలో ఉన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని మరింత పెంచడానికి ఈ ఉపకరణాలు ఉపయోగపడతాయని భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26,874 మందికి, 55,406 ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్‌లో చోటుదక్కనుందని అధికారులు తెలిపారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని