కేంద్రానికి మన్మోహన్‌ కీలక సూచనలు

ప్రస్తుతం భారత్‌ ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కరోనా (కొవిడ్-19) వైరస్‌ అనే మూడు ఇబ్బందులను ఎదుర్కొంటుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఒక ప్రముఖ.....

Published : 07 Mar 2020 00:22 IST

దిల్లీ: ప్రస్తుతం భారత్‌ ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కరోనా (కొవిడ్-19) వైరస్‌ అనే మూడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ప్రముఖ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, ఇవి ఆర్థిక, ప్రజాస్వామ్య పరంగా అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న గుర్తింపును తగ్గిస్తాయని తెలిపారు. రాజకీయ వర్గాలతో సహా సమాజంలోని కొంతమంది మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారని దిల్లీ అల్లర్లను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించి న్యాయం జరిగేట్టు చూడటంలో శాంతిభద్రతలను కాపాడవలసిన సంస్థలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ విషయంలో మీడియా కూడా వైఫల్యం చెందిందని అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చోటుచేసుకొంటున్నాయని, ఈ పరిస్థితులకు కారణమైన వారే వాటిని ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉదార ప్రజాస్వామ్య పద్ధతుల వల్ల కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలో భారత్ అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి నమూనా స్థాయి నుంచి దిగజారిపోయిందని తెలిపారు. ఆర్థికాభివృద్ధికి పునాదిలాంటి సామాజిక సామరస్యం ప్రమాదంలో ఉన్నప్పుడు పన్ను రేట్ల తగ్గింపు, కార్పొరేట్‌ రాయితీలు, విదేశీ పెట్టుబడులు వంటివి ఎటువంటి సహాయం చేయలేవని అన్నారు. భారత్‌లో కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వ్యాపించకుండా అరికట్టేందుకు వేగంగా స్పందించి, ఇతర దేశాల నుంచి మనం అవలంబించగలిగే పద్దతులను అధ్యయనం చేయాలని సూచించారు. మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత ప్రభావం చూపకముందే చర్యలకు ఉపక్రమించాలని కోరారు.

చివరగా దేశంలో నెలకొన్న పరిరస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వానికి ఆయన మూడు సూచనలు చేశారు. మొదటగా మనకున్న అన్ని వనరులను ఉపయోగించి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. రెండోదిగా  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఉపసంహరించాలి లేదా దానిలో మార్పులు చేయడం ద్వారా దేశంలో నెలకొన్న సామాజిక అస్థిరతను తగ్గించి ఐకమత్యాన్ని పెంచొచ్చు. మూడోదిగా ప్రమాదంలో ఉన్న ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దేందుకు మంచి ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు