పరదేశంలో పాక్‌ మూక హతం..!

పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం.. ఒక్క భారత్‌లోనే కాదు మధ్యప్రాశ్చ్యంలో కూడా నిర్వహిస్తుంటుంది. తాజాగా ఇలా వెళ్లన వారిలో దాదాపు 50 మంది మరణించారు. సిరియాలో కొన్నేళ్లుగా

Published : 08 Mar 2020 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్ ఉగ్రవాదుల దృష్టి.. ఒక్క భారత్‌పైనే కాదు సిరియాపై కూడా ఉంది. ఇరాక్‌-సిరియాల్లో కొన్నేళ్ల క్రితం ఐసిస్‌ విజృంభించింది. ఈ భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులై అక్కడకి వెళ్లారు. అయితే సిరియా,,రష్యా, ఇరాన్‌ల సంయుక్త సైన్యాలతో పాటు అమెరికా జరిపిన దాడుల్లో వేలాదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సమయంలో సిరియా ప్రభుత్వానికి మద్దతుగా షియాలకు చెందిన కొన్ని సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇటీవలే జరిగిన దాడుల్లో ఇలా వెళ్లన వారిలో దాదాపు 50 మంది పాక్‌ ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. సిరియాలో కొన్నేళ్లుగా అంతర్గత యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ వివిధ దేశాల మద్దతుతో సాయుధమూకలు ప్రజలపై, ప్రభుత్వ సైన్యంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ తిరుగుబాటుదారులకు మద్ధతు ముసుగులో టర్కీ సేనలు సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేశాయి.  ఈ నేపథ్యంలో టర్కీ, సిరియా ప్రభుత్వాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తింది. రష్యా మద్దతుతో సిరియా దళాలు టర్కీపై దాడులను పెంచాయి. ఇటీవల రష్యా, టర్కీ మధ్య ఒప్పందం కుదరడంతో కొంత విశ్రాంతి లభించింది. ఈ ఘర్షణల్లో మొత్తంలో 50 మంది పాక్‌ జాతీయులు కూడా మృతిచెందినట్లు అరబ్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ నోరుమెదపడంలేదు. వీరంతా సిరియాలోని జైనేబియోన్‌ బ్రిగేడ్‌ అనే సాయుధ గ్రూపునకు చెందిన వారిని అరబ్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంటోంది. ఈ గ్రూప్‌ను 2019లో అమెరికా ఆర్థిక బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది. వీరంతా పాక్‌కు చెందిన షియా ముస్లింలుగా భావిస్తున్నారు. వీరిని ఇరాన్‌లోకి ఖుద్స్‌ఫోర్స్‌ ఆకర్షించి సిరియాలో యద్ధానికి పంపింది. వీరికి ఇరాన్‌లోనే శిక్షణ కూడా ఇచ్చారు. జైనేబియోన్‌తోపాటు ఫతేమియోన్‌ అనే గ్రూప్‌లో కూడా పాక్‌ జాతీయులు ఉన్నారు. ఇడ్లిబ్‌లో ఇటీవల జరిగిన పోరాటాంలో ఈ రెండుగ్రూపులకు చెందిన 21 మంది మృతి చెందారు. ఇరాన్‌కు చెందిన హౌజా న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 

ఇదే తొలిసారి కాదు..
గతంలో కూడా పాక్‌ నుంచి ఐసిస్‌లో చేరేందుకు భారీ సంఖ్యలో యువత సిరియా, ఇరాక్‌కు తరలివెళ్లారు. వీరంతా సిరియా అధ్యక్షుడు అసద్‌ సేనలతో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని రక్షణరంగ విశ్లేషకుడు మహమ్మద్‌ ఆమీర్‌ రానా వెల్లడించారు. వీరిలో కొందరు భయపడి పాక్‌కు తిరిగిరాగా.. వారిని అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. మరోపక్క ప్రస్తుతం యుద్ధం తీవ్రతరం కానుండటంతో జైనేబియోన్‌ బ్రిగేడ్‌ గ్రూప్‌నకు చెందిన మరింత మంది మరణించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా పాక్‌లోని రేవుపట్టణమైన కరాచీలో ఈ గ్రూప్‌కు కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని