క్విజ్‌లో పాల్గొనండి.. పద్మ అవార్డులకు రండి

దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్నారా.. అలాంటి వారి కోసం మంచి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. పద్మ అవార్డులపై ఓ క్విజ్‌ పోటీ నిర్వహిస్తోంది

Updated : 09 Mar 2020 21:59 IST

వినూత్న అవకాశం కల్పిస్తున్న కేంద్రం

దిల్లీ: దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్నారా.. అలాంటి వారి కోసం మంచి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. పద్మ అవార్డులపై ఓ క్విజ్‌ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలిచిన వారు ఈ నెలాఖరులో జరిగే పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘ఏటా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన చాలా మంది విజేతలను పద్మ అవార్డులతో సత్కరిస్తున్నాం. వారి జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం. అలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికోసం ఓ పోటీ నిర్వహిస్తున్నాం. పద్మ క్విజ్‌లో పాల్గొనేవారికి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది’ అని పీఎంవో ఖాతా ద్వారా ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పాటు పద్మ క్విజ్‌ లింక్‌ను కూడా జత చేశారు. 

ఈ క్విజ్‌లో 20 ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్విజ్‌లో గెలిచిన వారిలో కొంతమందిని ఎంపిక చేసి మార్చి 20న రాష్ట్రపతి భవన్‌లో జరిగే పద్మ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డును ప్రకటిస్తారు. ఈ ఏడాది 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. 

లింక్‌ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని