145 దేశాలకు పాకిన కరోనా

కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల 631 మంది వైరస్‌ బాధితులుగా మారారు. 5,423 మంది మృతి చెందారు........

Updated : 14 Mar 2020 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల 631 మంది వైరస్‌ బాధితులుగా మారారు. 5,423 మంది మృతి చెందారు. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తికి ఇప్పుడు ఐరోపా కేంద్రంగా మారిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే తమ సేవల్ని అందించాలని కోరింది.  ఇక తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌ నగరంలో వరుసగా తొమ్మిదో రోజు వైరస్‌ బాధితుల సంఖ్య తగ్గింది. చైనాలో శుక్రవారం 11 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతిచెందగా.. మరణించిన వారి సంఖ్య 3,189కు చేరింది.

> దక్షిణ కొరియాలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారికంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండడం విశేషం. శుక్రవారం కొత్తగా 107 మందికి వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం ప్రటించింది. ఇప్పటి వరకు 67 మంది మృత్యువాత పడ్డారు. 

> ఇటలీపై కరోనా తన పంజా విసురుతోంది. 24 గంట్లో 250 మంది పొట్టనబెట్టుకుంది. దీంతో మృతుల సంఖ్య 1,266కు చేరింది. కొత్తగా 2,500 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 17,000 దాటింది. 

> ఇజ్రాయెల్‌లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. దీంతో మాస్కులు, ఇతర ఔషధాలు తమ దేశానికి ఎగుమతి చేయాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ భారత ప్రధాని మోదీని కోరారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 150 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మరో 35,000 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. 

> ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాలకూ కరోనా వ్యాపించింది. ఈక్వెడార్‌లో శుక్రవారం తొలిమరణం సంభవించింది. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్‌ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో పలు దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

> అమెరికాలో పరిస్థితి ఆందోళనకంగా మారుతుండడంతో అక్కడ ఎమర్జెన్సీ విధించారు. దీంతో భారత్‌లోని ఆ దేశా రాయబార కార్యాలయం, కాన్సులేట్లలో మార్చి 16 నుంచి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని భారత విద్యార్థులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని అక్కడ భారత రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే 24×7 హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు 49 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. దాదాపు 2000 మందికి కరోనా సోకింది.  

> కెనడా పార్లమెంటు సమావేశాల్ని రద్దు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన భార్యకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ట్రూడో ఇంటి నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. కెనడాలో ఇప్పటి వరకు 138 మందిని వైరస్‌ సోకింది. ఒకరు చనిపోయారు. 

ఇరాన్‌లో 514 మందిని ఈ మహమ్మారి బలిగొంది. స్పెయిన్‌లో 133 మందిని, ఫ్రాన్స్‌లో 79 మందినిపొట్టనబెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని