కరోనా: మీడియా పాత్రపై ప్రధాని కితాబు

దేశమంతా క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు........

Published : 17 Mar 2020 14:54 IST

దిల్లీ: దేశమంతా క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా బాధితులకు, అనుమానితులకు విశేష సేవలందిస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందించారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్న మీడియా పాత్రను కూడా ప్రధాని కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ మీడియా ఆదర్శంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా.. ప్రజలకు కచ్చితమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేస్తోందని కితాబిచ్చారు. అవగాహన కార్యక్రమాల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈరోజు జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీలకు మోదీ సూచించారు. ప్రతి సభ్యుడు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అవసరమైన చోట వైద్య వసతుల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైరస్‌ విషయంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాల్సిన అసవరం ఉందని అందుకనుగుణంగా కార్యక్రమాల్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు