మాస్క్‌లు, శానిటైజర్ల వివరాలివ్వకపోతే చర్యలు

మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను....

Published : 18 Mar 2020 19:29 IST

దిల్లీ: మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది. 
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందరికీ అందుబాటులోకి ఉండేందుకు, వాటి ధరలు, అమ్మకాలలో అక్రమాలను నివారించేందుకు ఈ వస్తువులను నిత్యావసరాలుగా ప్రకటించింది. ఈ పరిధిలోకి సర్జికల్‌ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు కూడా వస్తాయని తెలిపింది. ఈ నిబంధనలు మార్చి 13 నుంచి 100 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పై వస్తువుల ఉత్పత్తి, ధరల అదుపు, అక్రమ సరఫరాను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారమిచ్చింది. అంతేకాకుండా ఈ వస్తువులకు సంబంధించిన నిల్వల వివరాలను ఈ నెల 18 సాయంత్రం 6 గంటలలోగా ఇవ్వాలంటూ సంబంధిత సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అయితే మాస్కులు, సర్జికల్‌ గ్లౌజులు, హ్యాండ్‌ శానిటైజర్ల గురించిన అవసరమైన సమాచారాన్ని ఇప్పటి వరకు చాలా కొద్ది మంది తయారీదారులు, దిగుమతిదారులు మాత్రమే సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆదేశానుసారం వివరాలను సమర్పించని వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. చర్యల్లో భాగంగా తనిఖీలు, జప్తు మాత్రమే కాకుండా చట్టపరమైన శిక్షకు కూడా లోనవుతారని అధికారులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని