కరోనా: రోజుకూలీలకు యూపీ ఆర్థిక సాయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేద రోజుకూలీలకు ఆర్థిక సహాయం అందచేయాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 19 Mar 2020 01:36 IST

యోగి ప్రభుత్వం నిర్ణయం

లఖ్‌నవూ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేద రోజుకూలీలకు ఆర్థిక సాయం అందజేయాలి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా తీసుకున్న మూసివేత చర్యల వల్ల శ్రామికులు నష్టపోకుండా యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో విధివిధానాలను నిర్ణయించటం కోసం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ముఖ్యమంత్రికి మూడు రోజుల్లో నివేదికను అందచేయనుంది.

‘‘కరోనా నిరోధక చర్యల్లో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మూసివేతను కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంది. అయితే పూట గడిచేందుకు పేదవారు ప్రతిరోజూ శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు శ్రామికుల జీవనోపాధిపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో రోజువారీ శ్రామికులకు కరోనా ప్రభావిత కాలంలో ఆర్థిక సాయాన్ని అందజేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్థిక రాష్ట్ర మంత్రి సురేశ్‌ ఖన్నా నేతృత్వంలో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటయింది. దీనిలో వ్యవసాయ, కార్మిక మంత్రులు ఇతర సభ్యులుగా ఉంటారు. రోజువారీ సంపాదించే పేదల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్టీజీఎస్‌ ద్వారా నిర్ణీత మొత్తాన్ని జమ చేయనున్నాం’’ అని ఓ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని