శ్వేతసౌధంలో తొలి కరోనా కేసు

అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం శ్వేతసౌధంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. దేశంలో కరోనా పరస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉపాధ్యక్షుడి మైక్‌ పెన్స్‌ బృందంలో.......

Published : 21 Mar 2020 08:02 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం శ్వేతసౌధంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. దేశంలో కరోనా పరస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ, పెన్స్‌తో కానీ వైరస్‌ సోకిన వ్యక్తి నేరుగా సంప్రదించిన సందర్భాలు లేవని పెన్స్‌ కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్‌ తెలిపారు. ఈ మధ్య కాలంలో ఆయన్ని కలిసిన వారిని గుర్తించడంపై దృష్టి సారించామన్నారు. గతవారం ట్రంప్‌ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన కలిసిన పలువురు ప్రముఖులకు వైరస్‌ నిర్ధారణ కావడంతో వైద్య పరీక్షలు చేయించుకోక తప్పలేదు. దీంతో అప్రమత్తమైన శ్వేతసౌధం సిబ్బంది.. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించేలా కార్యాలయంలో సీటింగ్‌ ఆరేంజ్‌మెంట్‌లో మార్పులు చేశారు. 

మరోవైపు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 230కి చేరడంతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. గత 50 గంటల్లో 10 వేల కొత్త కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18 వేలు దాటింది. ఇప్పటికే జాతీయ ఆత్యయిక స్థితిగా ప్రకటించిన ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపి కరోనా మహమ్మారితో పోరాడుతోంది. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. వాషింగ్టన్‌లో అత్యధికంగా 74 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజారవాణాపై కూడా కఠిన ఆంక్షలు విధించారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తనకున్న అన్ని అధికారాలను ఉపయోగించుకుంటానని ట్రంప్‌ అన్నారు. కొరియన్‌ యుద్ధ కాలం నాటి నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చి వెంటిలేటర్లు, మాస్కుల తయారీని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ‘డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌’ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఉద్యోగుల వేతనాల్లో కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికా మొత్తం కలిసికట్టుగా పోరాడుతోందన్నారు. ప్రస్తుతానికి దేశం మొత్తాన్ని నిర్బంధించే పరిస్థితులు లేవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని