కరోనా ఎఫెక్ట్‌: వారికి రూ.1000 సాయం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Published : 21 Mar 2020 16:06 IST

లఖ్‌నవూ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజు కూలీలకు ఉపాధి లేకుండా పోతోంది. అనేక చోట్ల థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, సహా జనసమర్థం ఉన్న ప్రాంతాలను మూసివేస్తుండటంతో వాటిపై ఆధారపడి పనిచేసే రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల యూపీలోని సుమారు 15 లక్షల రోజువారీ కూలీలకు, 20.37 లక్షల గృహనిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందచేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. కొవిడ్‌-19 నివారణకు రాష్ట్రంలో అమలుచేస్తున్న మూసివేత వలన ఉపాధి కోల్పోయే శ్రామికుల సహాయార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.

ప్రజలందరూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 9 వరకు ‘జనతా కర్ఫ్యూ’కు కట్టుబడి ఉండాలని ఆదిత్యనాథ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని మెట్రో రైళ్లు, ప్రభుత్వ బస్సు సర్వీసులు ఆదివారం పనిచేయవని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ గురించి ఆందోళనకు గురికానవసరం లేదని యూపీ ముఖ్యమంత్రి అన్నారు. వస్తువుల కొనుగోలుకు దుకాణాల వద్దకు పరుగులు తీయనవసరం లేదని... రాష్ట్రంలో సరిపడా అత్యవసర వస్తువులు, ఔషధాల నిల్వలు ఉన్నాయని యోగి వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అవసరమైన ఐసొలేషన్‌ వార్డు సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికి 23 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వారిలో తొమ్మిది మంది కోలుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా కేసులు నమోదు కాగా ఐదు కరోనా మరణాలు సంభవించాయి. కరోనా సోకిన వారిలో 39 మంది విదేశీయులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని