కరోనా పరీక్షలకు 16 ప్రైవేటు ల్యాబ్‌లు

కరోనా (కొవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో 10 ప్రైవేటు ల్యాబ్‌లకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్) అనుమతి లభించింది.

Published : 24 Mar 2020 16:32 IST

 కొవిడ్‌-19 నిర్ధారణకు ఎంత వసూలు చేయాలంటే...

దిల్లీ: కరోనా (కొవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్‌లకు బయో మెడికల్‌ పరిశోధనల సాధికార సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. దీంతో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షకు అధికారిక అనుమతి గల ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య 16కు పెరిగింది. వీటిలో దేశ రాజధాని దిల్లీలో 3, గుజరాత్‌లో 2, హరియాణాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్ర 5, తమిళనాడులో 2 ఉండగా.... తెలంగాణాలో జూబ్లీ హిల్స్‌ వద్దనున్న అపోలో హాస్పిటల్స్‌కు కూడా ఈ అనుమతి లభించింది. 

కాగా, కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు వసూలు చేయవలసిన అత్యధిక మొత్తం రూ.4,500గా కేంద్రం ప్రకటించింది. దీనిలో రూ.1500 స్క్రీనింగ్‌ పరీక్ష నిమిత్తం, రూ.3,000 నిర్ధారణ పరీక్ష కోసం అని ఓ ప్రకటనలో వివరించింది. ఈ నిబంధనను పాటించని సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం హెచ్చరించింది. ఇక తాజా సమాచారం ప్రకారం కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో 3,81,739 కాగా మృతుల సంఖ్య 16,558 గా ఉంది. ఇక భారత్‌ విషయానికి వస్తే... కరోనా పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య 500, మృతులు 10 మంది అని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని