90 శాతం కరోనా కేసులు అక్కడే...

ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్‌-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు. 

Updated : 26 Mar 2020 17:12 IST

 వాతావరణంలో తేమ, వేడితో కరోనా వ్యాప్తి తగ్గనుంది

దిల్లీ: ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 90 శాతం కరోనా కేసులు 3 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 4-9 g/m3 కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలియచేసింది. గత అభిప్రాయాలకు భిన్నంగా, ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్‌-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు. 

మార్చి 22 వరకు లభించిన కరోనా వైరస్‌ వ్యాప్తి సంబంధిత గణాంకాలను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) అమెరికా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ ఫలితాలను బట్టి కరోనా వైరస్‌ వ్యాప్తి ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణం కరోనా వ్యాప్తిని నిరోధిస్తుందని వారు అంటున్నారు. భారత్‌తో సహా అన్ని ఆసియా దేశాల్లో రుతుపవనాల రాకతో గాలిలో తేమ 10g/m3 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.  కాగా ఈ విధమైన వాతావరణ పరిస్థితులు కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆలస్యం చేసాయని... దీనితో ప్రపంచవ్యాప్తం సుమారు 20,000 కరోనా మరణాలు నమోదుకాగా.. దేశంలో మరణాలు 10కి పరిమితం అయ్యాయని పరిశోధకులు విశ్లేషించారు. అంతే కాకుండా...

* జనవరి 22 నుంచి మార్చి 21 మధ్య తక్కువ ఉష్ణోగ్రత, తేమ (4-10 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత, 3-9 g/m3) ఉన్న ప్రాంతాల్లో అధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 
* ఇక మార్చి 11-19 మధ్యకాలంలో 18 డిగ్రీ సెంటిగ్రేడ్‌ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో పెరుగుదల,  8-12 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత గత దేశాల కంటే తక్కువే. 
* ఇక ఆర్ద్రత 9 g/m3 కంటే ఎక్కువగా ఉన్న దేశాల్లో గత మూడునెలల్లో కరోనా కేసులు ఆరు శాతం తక్కువ. 
అమెరికా, యూరప్‌లలో రానున్న వేసవికాలం పొడిగా ఉంటుంది. ఈ పరిస్థితి కరోనా నిరోధానికి అంత అనుకూలం కాదని కూడా ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది.

ఇతర దేశాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండగా.. 18 డిగ్రీ సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువున్న ఉష్ణమండల దేశాల్లో గతవారం మొత్తానికి 10,000 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందుకు కారణం ఈ ప్రాంతాల్లో అధిక వేడి, తేమ ఉండటమే అని పరిశోధకులు తెలిపారు. అయితే, దీనిపై పూర్తిగా నిర్థారణకు రావడానికి సమయం పడుతుందని, ఒక సైకిల్‌ పూర్తి కావాలని పరిశోధకులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని