మురికివాడలో కరోనారోగి మృతి:కాలనీమూసివేత

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారవికి చెందిన కరోనా వైరస్‌ బాధితుడు ఒకరు బుధవారం రాత్రి మరణించాడు.

Updated : 02 Apr 2020 14:32 IST

ముంబయి: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారవికి చెందిన వ్యక్తి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. మృతుడు ధారవిలోని ఏకేజీ నగర్‌లో వస్త్రదుకాణాన్ని నడుపుతూ ఉండేవాడు. కాగా, ఈ వ్యక్తి విదేశాలకు వెళ్లి వచ్చిన దాఖలాలు లేవు. మృతుడి కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. మృతుడితో సన్నిహిత సంబంధాలున్న వారందరికీ స్టాంపులు వేసి క్వారంటైన్‌కు తరలించారు. మృతుడు నివసించే స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ (మురికివాడల పునరావాస సంస్థ) కాలనీలో 8 భవనాలలో 308 ఫ్లాట్లు, 91 దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. కాగా వారికి అవసరమైన ఆహారం తదితరాలు తామే సరఫరా చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. అధిక జనసాంద్రత గల ధారవి కరోనా పరంగా సున్నితమైన ప్రాంతమని... అందుకే పూర్తి భవనాన్ని సీల్‌ చేశామని అధికారులు వివరించారు.

దగ్గు రావటంతో మార్చి 23న ఆ వ్యక్తి స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం మార్చి 28న ఛాతిలో నొప్పి రావటంతో ఇక్కడి సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. కాగా బుధవారం వెలువడిన కరోనా నిర్ధారణ పరిక్ష ఫలితాల్లో ఇతనికి వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది. అనంతరం అతనిని కస్తూర్బా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇదే తొలికేసు అని అధికారులు తెలిపారు. స్థానిక వార్డు అధికారుల కథనం ప్రకారం... ఈ వ్యక్తి రోజూ సమీపంలోని జామా మసీదుకు వెళ్లేవాడని తెలిసింది. కాగా ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తబ్లిగి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని... వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ముంబయిలో 24 గంటల్లో 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఈ నగరాన్ని ‘కరోనా హాట్‌స్పాట్‌’గా గుర్తించారు. కాగా, తాజాగా మరో 30 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు