ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన......

Updated : 06 Apr 2020 16:28 IST

ఏడాది పాటు అమలు
సంబంధిత ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రద్దు

దిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం కేబినెట్‌ భేటీ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.

కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌లో ఆమోదం తెలిపిందని ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏడాది పాటు కోత ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారని వివరించారు. ఈ మొత్తం సంఘటిత నిధికి వెళుతుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కోత వర్తిస్తుందని పేర్కొన్నారు.

అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జావడేకర్‌ తెలిపారు. రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం కూడా సంఘటిత నిధికి వెళుతుందన్నారు. లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు, దేశం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని